నాని (Nani) హీరోగా రానున్న చిత్రం ‘దసరా’ (Dasara).
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ… ‘ఆర్ఆర్ఆర్’ (RRR) దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ (Oscar) వస్తుందని టాలీవుడ్ హీరో నాని (Nani) ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కొత్త సినిమా ‘దసరా’ ప్రమోషన్లో భాగంగా ముంబయి వెళ్లిన నాని ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదిని చూసేలా రాజమౌళి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ఆయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యగలరని అన్నారు.
‘‘రాజమౌళి (Rajamouli) చిత్రాలను గమనిస్తే ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో పరిశీలిస్తారు. ఒక సీన్ను వివరించేటప్పుడు, దాన్ని రచించే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఆయన ఒక దార్శనికుడు. ఎవరికీ రాని ఆలోచనలు రాజమౌళికి వస్తాయి. ఎవరూ చేయని పనులు ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారు’’అని నాని ప్రశంసించారు.
ఇక ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట గురించి మాట్లాడుతూ..‘‘ఈ తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ పాట ఆస్కార్ గెలుచుకుంటుందన్న నమ్మకం నాకుంది. భారతీయ సినిమాలు ప్రత్యేకమైనవని నిరూపించారు. అవి అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ‘నాటు నాటు’ కేవలం ఆరంభం మాత్రమే’’అని నాని చెప్పారు.
ప్రస్తుతం నాని ‘దసరా’ (Dasara) ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై నాని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. నాని పూర్తి మాస్ లుక్లో కనిపించనున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా కనిపించనుంది. నాని కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది.