గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్లో ఉండటంతో గవర్నర్పేట సీఐ సురేష్కుమార్ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
విజయవాడ న్యాయవిభాగం, న్యూస్టుడే: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్లో ఉండటంతో గవర్నర్పేట సీఐ సురేష్కుమార్ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రీదేవి.. సదరు సీఐని ఆదేశించారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్వేలో ర్యాలీ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో అప్పట్లో గవర్నర్పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు.