YCP MLC Candidates List: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా

వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించారు. తాజాగా స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీల పేర్లను నేడు విడుదల చేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం నేడు వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మధ్యాహ్నం అధికారికంగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని వైసీపీ చెబుతోంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ప్రకటించనుంది. మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ నున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీపీఎం నేత గపూర్‍ను పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చేఅవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నర్తు రామరావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. విజయనగరం నుంచి పెనుమత్స సురేష్ బాబును కొనసాగించే అవకాశాలున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో రెండు స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కుడిపూడి సూర్యనారాయణ, ఇజ్రాయిల్‍‌లకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుంది. పశ్చిమగోదావరి నుంచి ఇద్దరికి అవకాశం లభించనుంది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, వంకా రవీంద్రనాథ్ పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి.

గుంటూరు నుంచి మర్రి రాజశేఖర్‍కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి పోతుల సునీత పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. నెల్లూరు నుంచి మెరుగు మురళి పేరు వినిపిస్తోంది. కర్నూలులో డా.మధుసూదన్ పేరు ప్రచారంలో ఉంది. అనంతపురం నుంచి బోయ తిప్పేస్వామికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. చిత్తురు నుంచి సిపాయి సుబ్రహ్మణ్యంకు ఛాన్స్ఉంటుందని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది.

శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్లు చెబుతున్నారు.

స్థానిక సంస్థల్లో కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మల మడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్తు రామారావు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో ఒకరికి, బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.