AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు

*ఆంధ్రప్రదేశ్ రాజధానుల విచారణలో మరో మలుపు ?*

*సుప్రీంకోర్టు జడ్జి హింట్ ! రాజ్యాంగ ధర్మాసనానికి వెళితే ?*

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారం మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు జడ్డి కేఎం జోసెఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రైతులకు వరంగా మారాయి.

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ పిటిషన్లను వేగంగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో అమరావతి రైతులు దీనిపై మరో పిటిషన్ దాఖలుకు సిద్దమవుతున్నారు.

దీనిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తే మాత్రం చాలా ట్విస్టులు చోటు చేసుకునే అవకాశముంది.

సుప్రీంలో అమరావతి పిటిషన్లు ఏపీ రాజధానిగా అమరావతినే ఖరారు చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటూ రైతులు, కొట్టేయాలంటూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టులో పోరాడుతున్నాయి.

అయితే వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటి వరకూ సుప్రీంకోర్టులో అసలు విచారణ ప్రారంభం కానే లేదు.

ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్న సుప్రీంకోర్టు కీలకమైన ఈ పిటిషన్లపై హడావిడిగా నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధంగా లేదు.

దీంతో అమరావతి పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

సత్వర విచారణకు సుప్రీం నో అమరావతి రాజధానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను వేగవంతంగా చేపట్టేందుకు సుప్రీంకోర్టు పలుమార్లు నిరాకరించింది.

తాజాగా మరోసారి ఇదే అంశాన్ని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

రాజ్యాంగ అంశాలతో ముడిపడిన ఈ పిటిషన్లపై హడావిడిగా విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పేశారు.

దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర మరోసారి ఇదే అంశాన్ని తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

ఈ నేపథ్యంలో సీజే ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.

*కేఎం జోసెఫ్ వ్యాఖ్యలతో ట్విస్ట్.*

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఫాస్ట్ ట్రాక్ లో నిర్వహించాలన్న విజ్ఞప్తిని తాజాగా న్యాయమూర్తి కేఎం జోసెఫ్ తోసిపుచ్చారు.

అంతే కాదు ఈ వ్యవహారం రాజ్యాంగ పరమైన అంశాలతో ముడిపడి ఉందని కూడా స్పష్టం చేశారు.

దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేకపోయింది.

ఇప్పుడు ఇదే అంశం ఈ పిటిషన్లలో కక్షిదారులుగా ఉన్న అమరావతి రైతులకు వరంగా మారింది.

సుప్రీంకోర్టు జడ్డి వ్యాఖ్యల ప్రాతిపదికగా మరో పిటిషన్ దాఖలు చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.

వచ్చే వారం ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నారు.

*రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ ?*

అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు రాజ్యాంగపరమైన ఆంశాల్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది.

దీన్ని సాధారణ బెంచ్ కంటే రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తేనే న్యాయం జరుగుతుందని కక్షిదారులుగా ఉన్న అమరావతి రైతులు భావిస్తున్నారు.

దీంతోపాటు తాజాగా సుప్రీంకోర్టు జడ్జి కేఎం జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా వారికి అనుకూలంగా మారాయి.

దీంతో వచ్చే వారం సుప్రీంకోర్టులో ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసేందుకు వారు సిద్దమవుతున్నారు.

ముఖ్యంగా ఓ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన ఈ పిటిషన్లను కనీసం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తేనే న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టును వారు కోరబోతున్నారు.

అదే జరిగితే విచారణ మరింత కీలకంగా మారనుంది.అంతే కాదు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు కూడా అంతిమ తీర్పు కావడం ఖాయం.